గోశాల

గోపూజ: గోవు క్షీరసాగర మథనం నుండి ఆవిర్భవించినది. గోవు సృష్టిలో గల ఏకైక సకల దేవతల స్వరూపం. గోవు లక్ష్మీ స్వరూపం. గోవు పున్నామ నరకం నుండి తప్పిస్తుంది. ఆశ్రమం ఆధ్వర్యంలోగల గోశాలలో 108 గోవులకు పైగా కలవు. మరియు క్షేత్రావరణాల్లో ప్రతిరోజు కపిల గోవులకు మరియు ఒంగోలు గోవులకు వాటి దూడలకు శాస్త్రోక్తముగా గోపూజ జరుగును.
భక్తులు గోపూజ చేయించుకొన దలచిన స్వయంగా పాల్గొని వారు చేయించుకొనవచ్చును. గోశాల వారిచే తగిన ఏర్పాట్లు చేయబడును. గోవులను పూజించిన, గోవులకు గ్రాసం పెట్టడం, గోవులకు దాణా పెట్టడం వలన సకల గ్రహ దోషములు గోమాత అనుగ్రహంతో ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆయుస్సు, సకల కళ్యాణాలు, మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు గోచరిస్తున్నాయి, కావున భక్తులు గోవులను పూజించి సకల దేవతానుగ్రహం పొందవలసినదిగా వ్యవస్థాపక పీఠాధిపతులు వారి మనవి.
ఆవు మన శ్రద్ధాకేంద్రము - మన తల్లి

వేదకాలంలో సత్యము, జ్ఞానము - ఇవి రెండు మూలభూత ధర్మాలు. ఈ రెండింటి సాధనలో భాగమే గోభక్తి. ఋగ్వేదంలోని గోసూక్తానికి సంబంధించి భరద్వాజ మహర్షి ఇలా అంటారు – “గోవులు ఐశ్వర్యం. గోవులే నాకు ఇంద్రాది దేవతలు. గోవు సోమరసముయొక్క మొదటి గుటక (ఘాంట్). ఇంద్రుని ప్రతినిధులైన గోవులను నేను నా హృదయపూర్వకంగానూ, మనఃపూర్వకంగానూ ప్రేమిస్తాను”. ఈ మంత్రంలో గోవు యొక్క ఆధ్యాత్మిక, భౌతిక అర్థాలు రెండూ కలిసి ఉన్నాయి. ఆ తర్వాతి సాహిత్యం - పురాణాలు, స్మృతులు, ధర్మ శాస్త్రాలలో గోభక్తి అతి స్పష్టంగా నిరూపించబడింది. గోహత్య మహాపాతకంగా చూడబడింది. అధర్వణవేదంలోని గో సూక్తం యొక్క మొదటిమంత్రంలో “మాతారుద్రాణాం, దుహితా వసూనాం స్వసాదిత్యానా మమృత స్యనాభిః .....మా వధిష్ట” అంటే “గోవు రుద్రులకు తల్లి, వసువుల కూతురు, ఆదిత్యుల సోదరి, అమృతం యొక్క నాభి! గోవును చంపవద్దు” అని చెప్పబడింది. ఇదే సూక్తంలో మరోచోట “ధేను:సదనమ్ రయీణామ్” అంటే “గోవు సకల సంపత్తులకు నిలయము” మరోరకంగా చెప్పాలంటే జగత్తులోని సమస్త పదార్థాలకు తల్లి వంటిది గోవు అని అర్థం. ఆర్ష సాహిత్యంలో - పాణిని వ్రాసిన అష్టాధ్యాయిలో వ్యవసాయానికి తోడుగా గోచర భూమి కూడా ఉల్లేఖించబడింది. పాణిని కాలంలో - అంటే క్రీ.పూ. 2800 నుండి 500 వరకు - ఏ ప్రదేశం యొక్క సుఖసంపదలనైనా గణించడానికి ప్రమాణం ఆ ప్రదేశపు గోసంపదే. స్మృతుల కాలంలో పంచగవ్యం వ్యాప్తిలో ఉంది. దానిని పరమ పవిత్రమైన ప్రసాదంగా భావించారు. రఘువంశానికి చెందిన దిలీప మహారాజు యొక్క గోభక్తి జగత్ప్రసిద్ధము. వారు నీడలా గోవు వెనువెంట నడిచేవారు. నందిని తనను గురించి “నేను ప్రసన్నురాలనైతే కేవలం పాలివ్వడమే కాదు సకల మనోవాంఛలను అనుగ్రహిస్తాను” అంటూ వాస్తవాన్ని చెప్పింది. గోపాలకృష్ణుని జీవిత చరిత్ర భారతీయ విలువలపై చెరగని ముద్రవేసింది. సిక్కు జైన, బౌద్ధ గ్రంథాలలో జీవరాసులన్నింటిపైనా కరుణ, అహింసలు ప్రతిపాదింపబడి ఉన్నాయి. ఆదినాథుడే ఋషభదేవుడు, సింధులోయ మరియు హరప్పాలలో లభించిన నాణాలపై ఋషభుని చిత్రం కనిపిస్తుంది. సామవేదం ఇలా అంటుంది. “సదాగావః శుచయో విశ్వధాయసః” అంటే “గోవులు సదా పవిత్రములు మరియు సర్వజన కళ్యాణ కారకములు” అని అర్థం. అధర్వణవేదంలోని గోసూక్తానికి అనుబంధంగానే స్కంధపురాణంలో గోవు “సర్వదేవమయీ, సర్వతీర్థమయీ” అని వర్ణింపబడింది. గోరజం కాస్త నుదుటికి రుద్దుకుంటే చాలు సమస్త పాపాలనుండి, దోషాలనుండి ముక్తి లభిస్తుంది. వత్సల అంటే తన దూడను ఆప్యాయంగా ప్రేమించేది గోవు. ‘సర్వైవల్ ఆఫ్ ది ఫిబెస్ట్’ ‘బలమున్నవాడికే బ్రతికే హక్కు’ అని నమ్మే ఐరోపీయ సమూహాలకు “సర్వే జనాః సుఖినోభవన్తు....” (అందరు జనులూ సుఖంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి) ఈ దృష్టికోణం అవగాహనకు అందని అంశమే అవుతుంది. గోవు భారతీయ సభ్యత, సంస్కృతి మరియు జాతీయ జీవనంతో ముడిపెట్టుకొని ఉన్న అంశం. గోవుపట్లగల సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ దృష్టి కోణాలన్నీ ఈ దేశ వాసుల ప్రధాన వృత్తి అయిన వ్యవసాయంతో ముడిపెట్టుకొని ఉన్నాయి. భారతీయ సంస్కృతి యొక్క మూలాధార విశ్వాసం ‘ఏకమ్ సత్ విప్రాః బహుధా వదన్తి’ ‘ఒకే సత్యాన్ని బుద్ధిమంతులు అనేక విధాలుగా పిలుస్తారు’. అన్నది ధ్యేయ వాక్యమైన కారణంగా ఇచ్చటి సమాజ సహజీవనం యొక్క అందరూ అంగీకరించే ఆధారం ‘అహింస’గా పరిగణించబడింది. భారతీయులకు గోపూజ ఆత్మబోధకు ఉపకరించే ఒక సనాతన మార్గము. పరంపరాగతమైన భారతీయ సమాజానికి ప్రతీక గోవు. అది అహింసా ప్రధానము, ఆత్మ బోధాత్మకమే గాక సనాతన భారతీయ సంస్కృతి యొక్క సంవర్ధనకై సమాజంలో సామూహిక స్ఫూర్తిని అది అందిస్తుంది. అందువల్లే యజుర్వేదం ఇలా అంటుంది. "గోః మాత్రా న విద్యతే' అంటే 'గోవు చేసే ఉపకారాలకు అంతమే లేదు' - అది మనకెంతగానో మేలు చేస్తుంది. ధార్మిక, సాంస్కృతిక దృష్టితో పరిశీలించినప్పుడు గోవు అనాదికాలంనుండి హిందూ సమాజానికి అత్యంత ప్రీతిపాత్రము, శ్రద్ధా కేంద్రము, పూజార్హము అహింసా ప్రధానమైన మన సంస్కృతికి గోమాత కేంద్రబిందువుగాను నిలిచినట్లు దర్శనమిస్తుంది. అంతేగాక గోవు మన సామాజిక, ఆర్థిక జీవనానికి వెన్నెముకగానూ నిలిచినట్లు బోధపడుతుంది. గోరక్ష, గోసేవ, వీటిని మన సామాజిక ఆకాంక్షలలో ఒక విడదీయలేని భాగంగా గుర్తించాము. చారిత్రిక దృష్టితో పరికించితే గోరక్షణకు సంబంధించిన ప్రశ్న మొట్టమొదటగా ముస్లిం శాసనకాలంలోనే కనపడుతుంది. అంతకు ముందు కాలంలో గోహత్య అసలు ఊహకందని మాట. ఇస్లాం ఈ దేశంలో హిందూ ధర్మ సంస్కృతులను సమూలంగా నాశనం చేయాలని ఆశించింది. అంతకు పూర్వం అది ఆక్రమించిన దేశాలన్నింటిలోనూ ఆయాదేశాల ధర్మ సంస్కృతులను నాశనం చేయడంలో అది కృతకృత్యమైంది. అయితే ఈ దేశంలో అది పూర్తి సాఫల్యమును పొందనప్పటికీ అందుకోసం అది అన్ని ప్రయత్నాలు చేసింది. ఇస్లామును మించి ఆంగ్లేయుల కాలంలో విదేశ సంస్కారాలతో ఎదిగిన హిందువులు హిందూ వ్యతిరేకతలో ఇస్లామీ శక్తులకు సహాయకులుగానే నిలిచారు. హిందూ ధర్మ సంస్కృతుల చిహ్నాలైన ఆవులు, దేవాలయాలపైన బరితెగించి సమ్మెట పోట్లు పొడిచారు. ఇప్పటికీ ఇది కొనసాగుతూనే ఉన్నది. ఈ యుగంలో గోమాత అత్యంత దయనీయమైన స్థితికి గురియైపోయింది. ఈ నేలపై గోమాతయొక్క రక్తపునదులు ప్రవహింపజేయ బడుతున్నాయి. ఆంగ్లేయులు గోమాంస భక్షకులు. వారు ఆవును మాంసాన్నిచ్చే జంతువుగానే గుర్తించారు. ముస్లింలు తాము తినడానికన్నా హిందువుల మనోభావాలను గాయపరిచేందుకే గోహత్యను ముమ్మరంగా కొనసాగించారు. మందిరాలను నేలమట్టం చేసి మసీదులు కట్టేందుకు ముందు వారు కావాలని గోవుల రక్తాన్ని ఆ స్థలంపై అలికేవారు. కారణమేమంటే ఆ స్థలంలో మరెన్నడూ హిందువు మళ్ళీ దేవాలయం కట్టరాదని, తాము ముట్టడులు జరిపే సమయంలో చేజిక్కిన ప్రాంతంలోని బావులు, చెరువులు, నదులు, కాలువలలో గోవు మాంసాన్ని, రక్తాన్ని కలుపుతూండేవారు. కారణం విధిలేక హిందువులు తమ పాదాక్రాంతం కావాలని. హిందువులు విశేషించి బ్రాహ్మణులు, సాధుసంతుల నోళ్ళలో బలవంతంగా గోమాంసాన్ని కుక్కి వారిని మతాంతరీకరణకు గురి చేస్తుండేవారు. అయితే ఇన్ని ఘాతుకాలకు గురైనప్పటికీ హిందూ సమాజం సదా సర్వదా గోరక్ష కార్యంలో తన ప్రయత్నాలను మానలేదు.
గోసంరక్షణ పథకం దాతలకు మనవి

ఓం శివశక్తి పీఠం ఆధ్వర్యంలో సుమారు 108 గోవులు కలవు. ఎనుబది నాలుగు లక్షల జీవరాశులలో మానవకోటికి వివిధ రూపములలో మహోపకారం చేస్తున్న మూగజీవి గోమాతే కామధేనువు. ఈ కామధేనువు క్షీర సాగర మధనం నుండి ఆవిర్భవించింది. సకల దేవతా స్వరూపమే ఈ గోమాత. గోవును పూజించిన వారికి సర్వదేవతానుగ్రహం పొందుదురు. గో సంరక్షణ మరియు గోవులకు ఆహార నిమిత్తమై, పశుగ్రాసం, పచ్చ గడ్డి, ఎండుగడ్డి, తవుడు, దాణా, ఉలవలు,వివిధ ధాన్యములు నిమిత్తం నగదు రూపేణా గానీ, వస్తు రూపేణా గానీ తమ శక్తి మేరకు తగు విరాళం భక్తులు, దాతలు ఇచ్చి ఓం శివశక్తి పీఠం లో ఉన్న గోమాతా, స్వామి, అమ్మవార్ల మరియు 84 దేవతామూర్తుల పరిపూర్ణానుగ్రహం పొందవలసినదిగా కోరుతున్నాము. విరాళములు నగదు రూపేణా గానీ, డి. డి. రూపేణా గానీ, చెక్ రూపేణా గానీ, కార్డు స్వైపింగ్ ద్వారా గానీ, ఆర్.టి.జీ.యస్./నెఫ్ట్ ద్వారా గానీ “ఓం శివశక్తి పీఠం ” విజయ బ్యాంకు, గాదరాడ బ్రాంచ్, ఎక్కౌంట్ నెం. : 421301013000002, ఐ.యఫ్.యస్.సి. కోడ్ : VIJB0004213 ద్వారా చెల్లించవచ్చును.