మహా శక్తి క్షేత్రం


1. శ్రీలంక - శాంకరీదేవి

అష్టాదశ శక్తిపీఠాలలో లంకలోని శాంకరీదేవిక్షేత్రం మొదటి శక్తిపీఠంగా పేర్కొనబడింది. ఇక్కడ
సతీదేవి కాలిగజ్జెలు పడినట్లుగా చెప్పబడింది. ప్రస్తుతం శ్రీలంకదేశ రాజధాని కొలంబో నగరానికి
సుమారు 270 కి.మీ దూరంలోవుండే ట్రింకోమలై పట్టణాన్ని శక్తిపీఠంగానూ, అక్కడి అమ్మవారిని
శాంకరీదేవి గానూ భావిస్తున్నారు.
కాగా మన ప్రాచీన మహర్షుల లెక్కప్రకారం ఈ శక్తి క్షేత్రం సరిగ్గా భూగోళానికి మధ్య భాగంలో
వుండేదని చెప్పబడింది. అయితే ఋషులు పేర్కొన్న ఈ భూమధ్యప్రాంతం, ప్రస్తుత భూమధ్యరేఖ
ఒకటికాదనే భావన కూడావుంది.
ఏదిఏమైనప్పటికీ ఈ శక్తిపీఠం భూమధ్య భాగంలో వుందని చెప్పబడిన కారణంగా, శ్రీలంకలోని
ట్రింకోమలై శక్తిపీఠం కాదని కొందరు పేర్కొం టున్నారు. అయితే ఈ శక్తిపీఠం గురించి స్పష్టమైన
ఆధారం లభించని కారణంచేత, ఇంకా ఎక్కువమంది విశ్వసిస్తున్నందువల్ల, శ్రీలంకలోని స్థానిక
కథలనుబట్టి, ప్రస్తుతానికి ట్రింకోమలైనే శక్తిపీఠక్షేత్రంగా భావించడం సబబుగా వుంటుంది. ఈ క్షేత్రానికి
సంబంధించిన పురాణకథ లంకాధిపతి రావణాసురునితో ముడిపడివుంది.
ప్రసిద్ధిలో వుండే కథనం మేరకు, త్రేతాయుగంలో రావణాసురుడు పార్వతీదేవిని ప్రసన్నం
చేసుకుని, ఆ దేవిని తన రాజ్యంలో కొలువుతీరేలాగా వరాన్ని పొందాడు. ఆ విధంగా పార్వదీదేవి
లంకానగరంలో శాంకరీదేవిగా కొలువుదీరింది. దాంతో అది శక్తిపీఠ క్షేత్రమైంది. అయితే పార్వతీదేవి
లంకలో కొలువుదీరేటప్పుడు రావణుడు సన్మార్గంలో వున్నంతకాలం వరకు మాత్రమే తాను లంకలో
కొలువై వుంటానని, రావణుడు అకృత్యాలకు పాల్పడి, అధర్మవర్తనుడైతే తాను లంకను వీడుతానని
షరతును విధించింది. తరువాత కాలంలో రావణుడు సీతాదేవిని అపహరించడంతో పార్వతీదేవి
లంకను వీడి, హిమాలయా లలో స్థిరపడిందని చెప్పబడింది.
అయితే ప్రస్తుతం ట్రింకోమలైలోని శాంకరీదేవి ఆలయానికి దగ్గరలోగల కొండపై ఒక
శిధిలాలయం వుండేదని, అదే శాంకరీదేవి ఆలయమని కొందరు పేర్కొంటున్నారు. 17వ శతాబ్దంలో
పోర్చుగీసువారు దాడిచేసి, ఈ ఆలయాన్ని కూలగొట్టారని చెప్పేందుకు చారిత్రక ఆధారాలు
లభించాయని కూడా చెబుతారు. అయితే ఆ ప్రదేశంలో ప్రస్తుతం శిధిలాలయం ఏదీలేదు. అక్కడ ఒక
స్తంభాన్ని మాత్రం మనము చూడవచ్చు.
2. కాంచీపురం - కామాక్షి

తమిళనాడులోని కాంచీపుర క్షేత్రం-మహాశక్తి పీఠాలలో రెండవది చెప్పబడింది. దీనికి కంచి
అని కూడా పేరు. ఈ క్షేత్రంలో అమ్మవారి వీపుభాగం పడింది. ఇక్కడి అమ్మవారి నామం కామాక్షీదేవి.
ఇక్కడి స్థలపురాణం ప్రకారం శివుడులేని ఒకానొక సందర్భంలో పార్వతీ దేవి దిగంబరులైన
తన చెలికత్తెలతో గడుపుతూవుంది. ఈ లోగా పరమేశ్వరుడు హఠాత్తుగా పార్వతీదేవి మందిలోకి
ప్రవేశించాడు. అప్పుడు తన చెలికత్తెల మానాన్ని కాపాడేందుకు పార్వతిదేవి తన రెండు చేతులతో
శివుడు రెండు కన్నులనూ మూసింది. శివుని కన్నులు మూయడంతో సూర్యచంద్రుల వెలుగుకరువై
లోకాలన్నింటిలో చీకట్లు అలుముకున్నాయి. అకాలప్రళయం సంభవించింది. అనేక జీవులు ప్రాణాలు
కోల్పోయాయి. అకాల ప్రళయానికి కారణమైన పాప ఫలితంగా పార్వతీదేవి శరీరమంతా
పూర్తిగానల్లగా మారిపోయింది. దాంతో పార్వతీదేవి తనను కాపాడమని శివుని వేడుకుంది,
తరుణోపాయాన్ని చెప్పాడు శివుడు.
పరమశివుని సూచనమేరకు పార్వతి బాలిక రూపంలో బదరికాశ్రమాన్ని చేరుకొని, అక్కడ
కాత్యాయన మహర్షికి కూతురుగా కొంతకాలం గడిపింది, తరువాత కంచి క్షేత్రాన్ని చేరుకుని, అక్కడ
సైకత లింగాన్ని రూపొందించుకొని, పంచబాణ మంత్రంతో తపస్సు చేయసాగింది. ఈ పంచబాణ
మంత్రం మన్మథాత్మకమైన కారణంతో శివుడు కామాగ్నికి గురయ్యాడు. అప్పుడు పార్వతీదేవిని
పరీక్షించమని గంగను పంపాడు శివుడు. గంగ ఉప్పొంగి కంచి క్షేత్రాన్నంతా నీటితో ముంచింది. ఆ
సమయంలో పార్వతి తన రక్షణకోసం సైకతలింగాన్ని గట్టిగా కౌగిలించుకుంది. పార్వతీ దేవి యొక్క
స్పర్శలో పరమశివుడు పులకించిపోయాడు. వెంటనే శివుడు ఏకామ్రేశ్వర రూపంలో పార్వతికి
ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు దేవతలందరూ వారిద్దరికీ కళ్యాణం జరిపించారు. ఆ సందర్భంలో
పార్వతీదేవి తన చూపులతోనే అందరిపైనా అమృతాన్ని కురిపించింది. దీనిని గమనించిన
పరమేశ్వరుడు ఆమెకు కామాక్షి అనే పేరును పెట్టాడు. ఆ తరువాత దేవతల, ఋషుల కోరిక మేరకు
ఏకామ్రేశ్వరుడు, కామాక్షీదేవి కంచిలో కొలువుదీరారు.
ఈ ఆలయంలో అమ్మవారు పద్మాసనంలో చతుర్బ జాలతో దర్శనమిస్తుంది. నాలుగు
చేతులతో పాశం, అంకుశం, పుష్పబాణం, చెరుకుగడ, ధనుస్సు వుంటాయి. ఈ తల్లిని
దర్శించినంతనే ఆమె చల్లని చూపులు భక్తులపై ప్రసరించి, భక్తుల కోరికలు నెరవేరుతాయి.
3. ప్రద్యుమ్నం - శృంఖలాదేవి

ప్రద్యుమ్న క్షేత్రం గురించి రెండు భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఈ క్షేత్రం గుజరాత్ రాష్ట్రంలో
వున్నదని కొందరు చెబుతుండగా, పశ్చిమబెంగాల్ లో వుందని మరికొందరు పేర్కొంటున్నారు.
గుజరాత్ రాష్ట్రంలో రాజ్ కోటకు దగ్గరలోవున్న సురేంద్రనగర్ లోని చోటిల్లామాతను అక్కడివారు
శృంఖలాదేవిగా భావిస్తారు.
కానీ పశ్చిమబెంగాల్ లోని హుగ్లీ జిల్లాలోని ‘పాండుపా’ గ్రామాన్ని ఎక్కువ మంది భక్తులు
ప్రద్యుమ్నంగా విశ్వసిస్తున్నారు. ఈ పాండుపా గ్రామం కలకత్తా నగరానికి దాదాపు 80 కి.మీ దూరంలో
వుంది. కాగా ఈ ప్రద్యుమ్నంలోని అమ్మవారికి శృంఖలాదేవి అని పేరు. ఇక్కడ అమ్మవారి ఉదరభాగం
పడిందని చెప్పబడింది. ఈ క్షేత్రంలోని అమ్మవారిని ఋష్యశృంగ మహర్షి ప్రతిష్ఠించాడని స్థలపురాణం
చెబుతోంది.
త్రేతాయుగంలో వంగదేశమును (ప్రస్తుత బెంగాల్ ప్రాంతం) రోమపాదుడు పాలించేవాడు.
ఒకానొక సమయంలో వంగదేశంలో తీవ్రమైన కరవుకాటకాలు ఏర్పడ్డాయి. ఆ కాలంలో తపోబల
సంపన్నుడైన ఋష్యశృంగుడు కాలుమోపిన ప్రదేశమంతా సస్యశ్యామలమై, క్షామమంతా
తొలగిపోయేది. దాంతో రోమపాదుడు కూడా ఋష్యశృం గుణ్ణి వంగదేశానికి రప్పించాడు.
ఋష్యశృంగుడు పాదం మోపడంతో వంగదేశంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, కరువుకాటకాలు తొలగి
రాజ్యం సుభిక్షమైంది. ఆ సందర్భంలోనే ఋష్యశృంగుడు శృంఖలాదేవిని ప్రతిష్ఠించాడని చెబుతారు.
ఋష్యశృంగుడు ప్రతిష్ఠించడం వలన ఆ దేవి శృంగలాదేవిగా పిలువబడుతూ, కాలక్రమంలో
శృంఖలాదేవిగా పిలువబడిందని స్థానిక గాథలవలన తెలుస్తోంది.
కాగా “శృంఖల” అంటే “సంకెళ్ళు” అనే అర్థంవుంది. ఈ దేవి సంకెళ్ళలాంటి భక్తుల
సమస్యలను తొలగించి, వారి కష్టాలను కడతేర్చుతుందని, అందుకే ఈ దేవిని శృంఖలాదేవిగా
పిలుస్తారని చెబుతారు.
ఈ అమ్మవారి నామానికి సంబంధించిన మరొక కథ కూడా ప్రచారంలో వుంది. సాధారణంగా
బాలింతలు నడుముకు గట్టిగా గుడ్డను కట్టుకుంటారు. దీనికే “బాలింత నడికట్టు” అని పేరు. ఈ
నడికట్టునే “శృంఖల” అని అంటారు. బాలింత పురిటి బిడ్డను కంటికి రెప్పలా ఎలాచూసు కుంటుందో
ఈ అమ్మవారు కూడా తన భక్తులను అలాగే చూసుకుంటుందని, అందుకే ఆదేవిని శృంఖలాదేవిగా
పిలుస్తారని కూడా చెబుతారు.
4. క్రౌంచపట్టణం (మైసూరు) - చాముండి

మన పురాణాలలో క్రౌంచపట్టణంగా పేర్కొనబడిన ప్రదేశమే ప్రస్తుత కర్నాటక రాష్ట్రంలోని
మైసూరు. పూర్వం ఈ ప్రాంతాన్ని మహిషాసురుడనే రాక్షసరాజు పరిపాలించే వాడు, అందుకే ఈ
ప్రాంతం “మహిసూరు”గా పిలువబడేది. ‘మహిసూరే’ కాలక్రమంలో “మైసూరు”గా మారిందని
చెబుతారు.
ఈ క్షేత్రంలో అమ్మవారు చాముండేశ్వరిగా కొలువుతీరింది. ఇక్కడ సతీదేవి తలవెంట్రుకలు
పడినట్లుగా చెప్పబడింది. కాగా ఆదిపరాశక్తి మహిషాసురుని అంతమొందించి ఇక్కడ
చాముండేశ్వరిగా వెలసిందని స్థలపురాణం చెబుతోంది.
పూర్వం మహిషాసురుడనే రాక్షసురుడు ఘోరతపస్సచేసి, దేవ, దానవ, మానవులలో ఏ
మగవాడు చంపలేనట్లుగా బ్రహ్మదేవుని నుండి వరాన్నిపొందాడు. ఆ వరగర్వంతో మహిషాసురుడు
సర్వలోకాలపై దండెత్తి, లోకాలన్నింటినీ ఆక్రమించుకొని, అందరినీ భాదించసాగాడు. చివరకు
ఇంద్రుణ్ణి జయించి స్వర్గాన్ని కూడా ఆక్రమించుకున్నాడు. అప్పుడు దేవతలంతా శ్రీమహావిష్ణువు వద్దకు
వెళ్ళి విషయాన్ని మొరపెట్టుకున్నారు. బ్రహ్మవరం కారణంగా మహిషాసురుని ఏ మగవాడు
చంపలేడని, కాబట్టి అతనిని చంపేందుకు స్త్రీకి మాత్రమే సాధ్యమవుతుందని చెప్పాడు విష్ణువు.
అప్పుడు దేవతలంతా మహిషాసురుని వధించమని ఆదిపరాశక్తిని ప్రార్థించారు. మహిషాసుణ్ణి
వధించేందుకై ఆ ఆదిపరాశక్తి 18 చేతులతో క్రొత్త అవతారాన్ని ధరించింది. బ్రహ్మ, విష్ణు,
మహేశ్వరులనుండి వెలవడిన తేజస్సులు ఆ దేవిలోకి ప్రవేశించాయి. దేవతలందరూ ఆ అమ్మవారికి
వివిధ ఆయుధాలను సమకూర్చారు. అప్పుడు దేవి మహిషాసురునిపై దండెత్తి, ఆ రాక్షసుని
అంతమొందించింది. ఆ తరువాత మహర్షుల ప్రార్థన మేరకు మహిషాసురుని సంహరించినచోటనే
కొండపైన ఆదిపరాశక్తి చాముండేశ్వరిగా కొలువుదీరింది. అమ్మవారు కొలువుతీరిన ఈ కొండలనే
చాముండేశ్వరి కొండలుగా పిలుస్తారు.
మరొక కథనం ప్రకారం, పూర్వం ఈ కొండమీద చండీ-ముండీ అనే రాక్షసులుండేవారని,
అందుకే ఈ కొండను “చండముండ” అని పిలిచేవారని. ఈ కొండ మీదనే ఆదిపరాశక్తి వారిని
సంహరించి, చాముండేశ్వరిగా వెలసిందని కూడా చెబుతారు.
అమ్మవారు ఆలయంలో స్వర్ణవిగ్రహ రూపంలో కొలువై దర్శనమిస్తుంది.
5. అలంపురం - జోగుళాంబ

అష్టాదశ శక్తిపీఠ క్షేత్రాలలో అయిదవ శక్తిపీఠ క్షేత్రంగా చెప్పబడిన అలంపుర క్షేత్రంలో
అమ్మవారు జోగుళాంబగా పిలువబడుతున్నారు. ఇక్కడ సతీదేవి ఖండితాంగాలలోని పై వరుస
దంతపంక్తి (దవడభాగం) పడిందని చెప్పబడింది. తెలుగుప్రాతంలోగల నాలుగు శక్తిపీఠ క్షేత్రాలలో ఈ
క్షేత్రం మొదటిది.
శ్రీశైల మహాక్షేత్రానికి నలుదిక్కులా నాలుగు ప్రధాన ద్వారక్షేత్రాలు, నలుమూలలా నాలుగు
ఉపద్వార క్షేత్రాలు ఉన్నాయని స్కాందపురాణంలోని శ్రీశైల ఖండం చెబుతోంది. చారిత్ర శాసనాలలో
కూడా ఈ ద్వార క్షేత్రాల ప్రస్తావన ఆంగ్లశకం 7-8 శతాబ్దాల నుండి కనిపిస్తున్నది. కాగా శ్రీశైల క్షేత్రానికి
ఈ అలంపురం పశ్చిమ ద్వారంగా చెప్పబడింది.
అలంపుర క్షేత్రానికి దక్షిణకాశీయని పేరు. వరుణ, అసి నదులు గంగా నదిలో సంగమించే చోట
కాశీక్షేత్రం వున్నట్లుగానే, తుంగ - భద్ర నదులు కృష్ణానదిలో కలిసే ప్రదేశంలో అలంపురం వుంది. కాశీ
ఆలయం వరుణ - అసి నదుల మధ్య వున్నట్టుగానే అలంపురం ఆలయం కూడా వేదవతి - నాదవతి
అనే నదుల మధ్య వుంది. కాశీలో వున్నట్లుగానే ఒకప్పుడు యిక్కడ 64 స్నానఘట్టాలు వుండేవట.
అందుకే యిది దక్షిణ కాశిగా పేరొందింది.
ఈ క్షేత్రంలో తొమ్మిది శివాలయాలుండటం విశేషం. వీటికే నవబ్రహ్మ ఆలయాలు అని పేరు.
చాళుక్యుల కాలంలో నిర్మితమైన ఈ ఆలయాలు యించుమించుగా ఒకే వాస్తు నిర్మాణ శైలిలో
వున్నాయి. స్వర్గ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, గరుడ బ్రహ్మ, బాలబ్రహ్మ, అర్కఅబహ్మ, కుమారబ్రహ్మ,
వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, తారకబ్రహ్మ అనే పేర్లతో ఈ ఆలయాలలో పరమేశుడు లింగ స్వరూపునిగా
పూజలందుకుంటున్నాడు. ఈ నవబ్రహ్మ ఆలయాలలో బాల బ్రహ్మేశ్వరాలయం ప్రధాన ఆలయంగా
చెప్పబడుతోంది.
ఇక్కడ స్థలపురాణంలో మొదట బ్రహ్మ యిక్కడ తపస్సుచేసినట్లు పేర్కొనబడింది. ఇంకా
యిక్కడి బ్రహ్మేశ్వరుని సేవించిన వారికి బ్రహ్మపథం లభిస్తుందని కూడా స్థలపురాణం అంటోంది.
జమదగ్ని, పరశురాముడు మొదలైన మహర్షులు యిక్కడ తపస్సు చేశారని చెబుతారు. ఎన్నో
ఆలయాలతో, మరెంతో శిల్పసంపదతో అలరారే ఈ క్షేత్రం, ఎన్నో అరుదైన శిల్పాలతో కూడివుండి
ఆలయ వాస్తు నిర్మాణ పద్ధతులకు కాణాచిగా నిలిచింది.
ఇక్కడి జోగుళాంబ అమ్మవారు యోగాంబ, యోగీశ్వరి, యోగినీశ్వరి, జోగాంబ, జోగీశ్వరి
మొదలైన పేర్లతో పిలువబడింది. కాగా ఇటీవలికాలం వరకు జోగుళాంబకు ప్రత్యేకమైన
ఆలయంలేదు. బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఆగ్నేయ మూలనున్న ఒక చిన్నగదిలో అమ్మవారు
ప్రతిష్ఠితురాలై దర్శనమిచ్చేది. ఈ గదిలోని అమ్మవారిని భక్తులు నేరుగా కాక, గది ద్వారం పక్క నుండి
తొంగి చూసి దర్శించుకోవలసి వచ్చేది.
అలంపురంలోని నవబ్రహ్మ ఆలయాల నిర్మాణ శైలిలోనే, బాదామి చాళుక్యుల శైలిలో పూర్తిగా
రాతితో ఈ ఆలయం నిర్మితమైంది. మంచి అయితే చారిత్రకంగా లభించిన ఆధారాలను బట్టి
జోగుళాంబకు ఒకప్పుడు ప్రత్యేకంగా ఆలయం వుండేదని, తరువాతి కాలంలో దుండగుల
విధ్వంసానికిగురైన ఈ ఆలయంలోని అమ్మవారు సుమారు ఆంగ్ల శకం 12వ శతాబ్దంలో బ్రహ్మేశ్వర
ఆలయంలోనికి చేర్చబడిందన భావించబడుతోంది. ఒకప్పుడు వుండిన జోగుళాంబ ఆలయ
ప్రదేశాన్ని గుర్తించి, ఆ ప్రదేశంలోనే నూతన ఆలయం నిర్మించబడింది.
ప్రస్తుతం జోగుళాంబాదేవి అలంకరణలో శాంత మూర్తిగా దర్శనమిస్తున్నప్పటికీ, వాస్తవంగా
ఈదేవి ఉగ్రస్వరూపిణి. ఈమె ఉగ్రత్వాన్ని తగ్గించేందుకు ఆదిశంకరుల వారు ఒక ప్రక్రియను చేసారని
కూడా చెబుతారు.
ఈ అమ్మవారు నాలుగు చేతులను కలిగివుండి, కుడివైపు పైచేతిలో కపాలాన్ని, క్రింది చేతిలో
ఖడ్గాన్ని, ఎడమవైపు పైచేతిలో గొడ్డలిని, క్రింది చేతిలో పాన పాత్రను ధరించి వుంటుంది. ఈ దేవి
కపాలమాలనే యజ్ఞోప వీతంగా ధరించి వుంటుంది. ఇంకా ఊర్ధ్వకేశాలతో, రౌద్రంగా కన్పించే పెద్ద
కండ్లతో, పెద్ద కోరల తో, నోరు తెరచి, నాలుక బయటకు చాపినట్లుగా ఈమె రూపం వుంటుంది. ఈమె
తలపై ఎడమవైపు గుడ్లగూబ, క్రింది భాగంలో పుర్రె, కుడివైపున బల్లి, బల్లికి కపాలానికి మధ్యన
పాపిడి స్థానంలో తేలు వుంటుంది. ఈ దేవి ఆరాధన వలన యోగసిద్ధి కలుగుతందని, అందుకే
ఎక్కువమంది సిద్ధపురుషులు ఈమెను ఆరాధించారని చెబుతారు.
6. శ్రీశైలం - భ్రమరాంబ

శ్రీశైల మహాక్షేత్రంలో సతీదేవి యొక్క మెడభాగం పడినట్లుగా చెప్ప బడుతోంది. ఇక్కడి
అమ్మవారికి భ్రమరాంబాదేవియని పేరు.
శ్రీశైల మహాక్షేత్రం శక్తిపీఠమే కాకుండా జ్యోతిర్లింగ క్షేత్రం కూడా. ఈ క్షేత్రనాథుడైన
మల్లికార్జునుడు జ్యోతిర్లింగ స్వరూపుడు. మరెక్కడా లేనివిధంగా జ్యోతిర్లింగం - మహాశక్తి ఒకే ఆలయ
ప్రాంగణంలో వెలసి వుండడం ఈ క్షేత్రం యొక్క విశేషం. అందుకే ఈ క్షేత్రం ప్రఖ్యాత శైవక్షేత్రంగానే
కాకుండా శక్తిస్థలంగా కూడా ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది.
శ్రీశైల మహాక్షేత్రం ఎంతో మహిమాన్వితమైంది. అష్టాదశ పురాణాలలోని తొమ్మిది పురాణాలు,
మరెన్నో తెలుగు, సంస్కృత, మరాఠీ గ్రంథాలు శ్రీశైల క్షేత్ర మాహాత్మ్యాన్ని ఎంతగానో కొనియాడాయి.
ఈ క్షేత్రం యొక్క సమస్త విషయాలను స్కాందపురాణంలోని శ్రీశైలఖండం ఎంతో వివరంగా
చెబుతోంది.
మన పురాణాలలో ఈ క్షేత్రం భూమండలానికి నాభి స్థానంగా చెప్ప బడింది. అందుకే మనం
వివిధ వైదిక కర్మలను ఆచరించేటప్పుడు చెప్పుకునే సంకల్పంలో “శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే..., శ్రీశైలస్య
ఉత్తర దిగ్భాగే…” అంటూ మన ఉనికిని శ్రీశైలక్షేత్రాన్ని కేంద్రంగా చేసుకొని అంటే మనం శ్రీశైలక్షేత్రానికి ఏ
దిక్కున వున్నామనేదాన్ని వివరంగా చెప్పుకుంటాం.
యుగయుగాలుగా ప్రసిద్ధి చెందిన శ్రీశైల క్షేత్రాన్ని కృతయుగంలో హిరణ్యకశిపుడు,
త్రేతాయుగంలో శ్రీ రాముడు, ద్వాపరంలో పాండవులు దర్శించారని పురాణాలలో చెప్పబడింది.
కలియుగంలో దత్తాత్రేయులు, శంకరభగవత్పాదులు, మంత్రాలయ రాఘవేంద్రయతీంద్రులు, ఇంకా
శివశరణులైన అల్లమ ప్రభువు, అక్కమహా దేవి, సిద్ధరామప్ప ఈ క్షేత్రంలోని దేవతలను సేవించారు.
ఇక్కడి అమ్మవారి ఆవిర్భావానికి సంబంధించిన కథ స్కాందపురాణంలో చెప్పబడింది.
కృతయుగంలో అరుణాసురుడనే రాక్షసుడు బ్రహ్మను గురించి తపస్సుచేసి, తనకు స్త్రీచేతగాని,
పురుషుడి చేతగాని, నపుంసకుని చేతగాని, మరే ఆయుధం వలన గాని, రెండు కాళ్ళ జీవి వలనగాని,
నాలుగుకాళ్ళ జంతువు వలనగాని మరణంలేని వరాన్ని పొందాడు. ఆ వరగర్వంతో లోకాన్నింటిని
బాధించ సాగాడు అరుణుడు. దాంతో దేవతలందరూ ఆదిపరాశక్తిని ప్రసన్నం చేసుకుని, ఆ రాక్షసుని
ఆగడాలను మొరపెట్టుకున్నారు. అప్పుడు పరాశక్తి వారికి అభయాన్నిచ్చి, భ్రమర రూపాన్ని (తుమ్మెద
రూపాన్ని) ధరించి అరుణాసురుని సంహరించి, శ్రీశైల క్షేత్రంలో భ్రామరీ శక్తిగా కొలువు తీరింది.
ఇక్కడ విశాలమైన ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఆలయానికి వెనుక కొంత ఎత్తులో
అమ్మవారి ఆలయం నిర్మించబడింది. అమ్మవారి ఆలయాన్ని చేరేందుకు స్వామివారి గర్భాలయ
వెనుకభాగం నుండి విశాలమైన మెట్లు వుండేవి.
ఆలయంలోని అమ్మవారి మూలమూర్తి ఉగ్రరూపిణి అయినప్పటికీ, అలంకార రూపంలో
సౌమ్యమూర్తిగా దర్శనమిస్తుంది. రూపంలో ఉగ్రస్వరూ పిణి అయినా, ఈ తల్లిని మన పురాణాలు
దయా స్వరూపిణిగా పేర్కొ న్నాయి. కాగా ఆదిశంకరులవారు ఈ క్షేత్రాన్ని సందర్శించిన సమయంలో
అమ్మవారి ఉగ్రరూపాన్ని తగ్గించేందుకు ఒక ప్రక్రియనుచేసి, శ్రీచక్రాన్ని ప్రతిష్టించినట్లుగా చెప్పబడింది.
ఇక్కడి అమ్మవారి మూలరూపం మహిషాసురమర్దిని రూపంలో వుంది. కానీ అలంకార
రూపంలో మనం అమ్మవారి ముఖాన్ని మాత్రమే దర్శించ గలుగుతాం. ఎనిమిది చేతులుగల ఈ దేవి
ఎడమ పాదంతో మహిషాన్ని గట్టిగా తొక్కిపట్టి, దాని ముఖాన్ని ఎడమ హస్తంతో పైకెత్తి పట్టుకుని,
కుడి హస్తంలో శూలాన్ని ధరించి, మహిషాన్ని వధించినట్లుగా చూపబడింది.
అమ్మవారి తక్కిన చేతులలో కుడివైపున క్రింది నుండి పైకి వరుసగా బాకు, గద, ఖడ్గము...
అట్లే ఎడమ వైపున విల్లు, డాలు, పరిఘ వుంటాయి. అమ్మవారి కుడి భుజంలో అంబులపొది కూడా
వుంటుంది. అమ్మవారి ప్రభావళికి కుడివైపున సింహం మలచబడివుంది.
ఈ అమ్మవారి ఆలయంలో ఎంతో విశేషం వుంది. ఇక్కడి గర్భాలయ వెనుక గోడపై ఒక చిన్న
రంధ్రం కనిపిస్తుంది. 1984-85 వరకు ఈ రంధ్రం దగ్గర చెవిని పెడితే తుమ్మెదనాదం ఎంతో స్పష్టంగా
వినిపిస్తుండేది. ఆకాశవాణి కేంద్రం వారు ఈ నాదాన్ని రికార్డు కూడా చేశారు.
7. కొల్హాపూర్ - మహాలక్ష్మి

మహారాష్ట్రలోని కొల్హాపూర్ క్షేత్రంలో కొలువైన మహాలక్ష్మీదేవిని స్థానికులు “అంబాబాయి”
అని పిలుస్తారు. ఈ అమ్మవారిని భవానీమాతాయని, ‘కరవీరవాసాని’ అనికూడా స్థానికులు
పేర్కొంటారు. ఇక్కడ సతీదేవి యొక్క నేత్రాలు పడినట్లుగా చెప్పబడింది. ఈ క్షేత్రానికి కరవీర క్షేత్రమనే
పేరు కూడా వుంది. ప్రళయకాలంలో నీటిలో మునిగిన ఈ క్షేత్రాన్న మహాలక్ష్మి తన కరములతో
పైకెత్తడం వలన, దీనికి ఆ పేరొచ్చింది.
ముక్తిని ప్రసాదించే ఆరు క్షేత్రాలలో ఈ కరవీరక్షేత్రం కూడా ఒకటి. తక్కినవి విరూపాక్షం
(హంపి), శ్రీశైలం, పండరీపురం, శ్రీరంగం, రామేశ్వరం. స్థలపురాణం ప్రకారం పూర్వం కొల్హుడు అనే
రాక్షసుడు బ్రహ్మచేత యుద్ధంలో సులభంగా విజయం లభించే వరాన్ని పొందాడు. ఆ వరంతో అన్ని
రాజ్యాలను జయించాడు. తరువాత యితర లోకాలను ఆక్రమించేందుకు బయలుదేరిన కొల్హుడు
రాజ్యభారాన్ని తన పెద్ద కుమారుడైన కరవీరునికి అప్పగించి, మిగిలిన తన ముగ్గురు కుమారులను
అతనికి సహాయకులుగా నియమించాడు. కరవీరుడు అతని ముగ్గురి కుమారులు కూడా జనాలను
బాధపెడుతూ, ఋషులను, మునులను బాధిస్తూ, యజ్ఞయాగాదులను ధ్వంసం చేయసాగారు.
దాంతో దేవతల కోరిక మేరకు పరమేశుడు కరవీరుని, అతని ముగ్గురు సోదరులను
అంతమొందించాడు. తన కుమారుల మరణానికి ఎంతగానో పరితపించిన కొల్హుడు రాజ్యానికి
తిరిగివచ్చి, దేవతలపై పగ పెంచుకుని, ప్రతీకారంతో వారిని హింసించసాగాడు. చివరకు దేవతల
ప్రార్ధన మేరకు మహాలక్ష్మి స్వరూపంలో ఆదిపరాశక్తి కొల్హుడిని సంహరించింది.
కొల్హుని చివరి కోరిక మేరకు మహాలక్ష్మి కొల్హాపురంలోనే కొలువుతీరిందని, కొల్హుడు చంపబడిన
ఈ ప్రాంతం కొల్హాపురంగా పేరొందిందని చెబుతారు.
కొల్హాపురి ఆలయం మహారాష్ట్ర నిర్మాణ శైలిలో చూసేందుకు ఎంతో గొప్పగా కనిపిస్తుంది.
ఆలయంలో అమ్మవారి విగ్రహశిలను ఎంతో ప్రశస్తమైన మణిశిలగా పేర్కొంటారు. సింహవాహనియైన
ఈ దేవి చతుర్భుజురాలై, చేతులలో చెరుకువిల్లు, ఫలం, డాలు, కలశాన్ని ధరించి వుంటుంది.
కిరీటమకుటంగల ఈ దేవి శిరస్సుపై అయిదు శిరస్సుల ఆదిశేషుడు ఛత్రం పడుతున్నట్లుగా
వుంటాడు. నల్లని ముఖంతో అనేక ఆభరణాలతో అలరారే ఈ దేవిని దర్శించేందుకు రెండు కన్నులూ
చాలవని భక్తులంటారు.
8. మాహూర్యం - ఏకవీరాదేవి

మహారాష్ట్రలోని మాహూర్యం క్షేత్రంలో పరాశక్తి ఏకవీరాదేవి పేరుతో కొలువుతీరి
పూజలందుకుంటోంది. మాహూర్యాన్నే ప్రస్తుతం ‘మాహోర్’ అని పిలుస్తున్నారు. ఈ క్షేత్రంలో సతీదేవి
కుడిచేయి పడిందని చెప్పబడుతోంది. ఈ మాహూర్యం దత్తాత్రేయుని జన్మస్థలమని, యిక్కడి
ఏకవీరాదేవిని దత్తాత్రేయుడు ఆరాధించాడని చెబుతారు.
ఇక్కడి స్థలపురాణం ప్రకారం పరశురాముడు తాను చేసిన ప్రతిజ్ఞ ప్రకారం ఇరవై ఒక్కసార్లు
దండెత్తి క్షత్రియులందరినీ అంతమొందించాడు. ఆ పాప పరిహారం కోసం తీర్థయాత్రలుచేస్తూ, అనేక
చోట్ల శివలింగాలను ప్రతిష్ఠించాడు. ఆ తీర్థయాత్ర సందర్భంగా, ఈ మాహూర్యంలో పరశురాముడు
యజ్ఞం చేస్తుండగా, యజ్ఞ సమయంలో పరశురాముని ఆశీర్వదించేందుకు ఆదిపరాశక్తి ఏకవీరాదేవి
రూపంలో యిక్కడకు విచ్చేసి, ఈ క్షేత్రంలోనే కొలువుదీరినట్లుగా తెలుస్తోంది.
ఈ క్షేత్రానికి సంబంధించిన మరొక కథ కూడా వుంది. పూర్వం యిక్కడ జమదగ్ని మహర్షి
ఆశ్రమం వుండేది. జమదగ్ని భార్య రేణుక మహాపతివ్రత. తన పాతివ్రత్య ప్రభావంతో ఆమె రోజూ
నదీతీరంలో ఇసుకతో కుండను చేసి, ఆ కుండలో నీటిని నింపుకొని ఆశ్రమానికి వచ్చేది. ఆ నీటితోనే
జమదగ్ని పూజాదికాలను నిర్వర్తించేవాడు.
ఒక రోజున రేణుక నదికి వచ్చేసరికి నదిలో ఒక గంధర్వుడు జలక్రీడలాడు తున్నాడు. ఆ
దృశ్యాన్ని చూసిన రేణుక మనస్సు కొంచెంచలించింది. మనస్సు చంచలమవ్వడంవలన ఆమె
పాతివ్రత్య శక్తి సన్నగిల్లడంతో ఇసుకతో కుండను చేయలేకపోయింది రేణుక. దాంతో వట్టి చేతులతో
ఆమె ఆశ్రమానికి తిరిగొచ్చింది. తన యోగ దృష్టితో జరిగినదంతా తెలుసుకొన్న జమ దగ్ని, తన
నలుగురు కుమారులను పిలిచి తల్లిని సంహరించమని ఆజ్ఞాపించాడు. వారెవ్వరూ తల్లిని
సంహరించలేదు. అప్పుడు అయిదవ కుమారుడైన పరశురాముణ్ణి పిలిచి, తల్లిని, తల్లితోపాటు
నలుగురు సోదరులనూ వధించమని ఆదేశించాడు జమదగ్ని. తండ్రి ఆజ్ఞను శిరసావహించి, వారందరి
తలలను నరికాడు పరశు రాముడు.
అప్పుడు జమదగ్ని సంతోషించి, పరశురాముని ఏదైనా వరాన్ని కోరుకో మన్నాడు.
పరశురాముడు తన తల్లిని, సోదరులను తిరిగి బ్రతికించమని కోరడంతో వారందరూ
పునరుజ్జీవితులయ్యారు. ఈ విధంగా పరశురాముడు తల్లి, సోదరుల తలలను నరికిన ప్రదేశమే
మాహూర్యంగా చెప్పబడింది.
ఇక్కడి గర్భాలయంలో పెద్ద పెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తాకేంత భారీగా అమ్మవారి
తలమాత్రమే దర్శనమిస్తుంది. అమ్మవారికి మెడ, భుజాలు, చేతులు, కాళ్ళు యితర అవయవాలు
ఏమీవుండవు. అమ్మవారి శిరోభాగానికే పూజాదికాలు నిర్వహిస్తారు. స్థానికులు అమ్మవారిని
శ్రీమాతాదేవి అనికూడా పిలుస్తారు.
9. ఉజ్జయిని - మహంకాళి

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో వెలసిన అమ్మవారికి మహాకాళి అని పేరు. అక్కడ
సతీదేవి యొక్క పై పెదవి పడిందని దేవీ భాగవతం చెబుతోంది. ఉజ్జయిని జ్యోతిర్లింగ క్షేత్రం కూడా.
ఇక్కడ కొలువైన పరమేశుని మహాకాళేశ్వరుడని పిలుస్తారు.
మోక్షాన్ని ప్రసాదించే ఏడు పురాలలో ఉజ్జయిని కూడా ఒకటి. తక్కినవి అయోధ్య, మధుర,
కాశి, కంచి, పురీ, ద్వారక. ఈ క్షేత్ర ప్రాశస్త్యం అగ్ని, . స్కాంద, శివ, భవిష్య పురాణాలలోనూ,
భారతీయ ఇతిహాసాలలోనూ, మరెన్నో ప్రాచీన గ్రంథాలలోనూ ఎంతగానో స్తుతించబడింది.
మన పురాణాలలోనూ, ప్రాచీన శాస్త్రాలలోనూ ఈ ఉజ్జయిని అవంతి, అవంతిక, విశాల,
కనకశృంగ, కుముద్వతీ, కుశస్థలి, అమరావతి అనే పేర్లతో పిలువబడింది. ఈ ఉజ్జయినిలోనే
సాందీపుని ఆశ్రమంలో శ్రీకృష్ణ బలరాములు విద్య నభ్యసించారు. భట్టి విక్రమార్క కథలకు
ఆధారభూతమైన భేతాళవృక్షం ఉజ్జయినిలోనే వుండేదని చెబుతారు.
కాగా, యిక్కడి స్థలపురాణం ప్రకారం... పూర్వం అంథకాసురుడనే రాక్షసుడు లోకాలన్నింటినీ
బాధిస్తూ, ప్రజలను హింసించసాగాడు. దేవతల కోరిక మేరకు. ఆ రాక్షసుని చంపేందుకై పరమేశుడు
మహాకాళేశ్వర రూపంతో ఆ రాక్షసునితో యుద్ధానికి తలబడ్డాడు.
అయితే బ్రహ్మదేవుని వరప్రభావంతో అంథకాసురుడి రక్తం ఎన్ని చుక్కలు నేల చిందితే
అంతమంది రాక్షసులు పుట్టుకొరాసాగారు. అప్పుడు ఆదిపరాశక్తి కాళికాదేవి అవతారాన్ని దాల్చి
యుద్ధభూమిలో నిలచి, తన పొడవైన నాలుకను చాచి, అంథకాసురుడి రక్తం ఒక బొట్టుకూడా నేల
మీద చింద కుండా తాగేసి, పరమేశునితో అంథకాసురుని సంహరింపజేసింది. ఈ సందర్భములోనే
యిక్కడ మహాకాళేశ్వరునితో పాటు, మహాకాళికూడా కొలువుతీరింది.
10. పిఠాపురం-పురుహూతికాదేవి

పిఠాపురం మన రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో వుంది. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన
ఈ క్షేత్రం స్వయంభూ కుక్కుటేశ్వర క్షేత్రంగానూ, మూడు గయలలో ఒకటైన పాదగయ క్షేత్రంగాను,
పంచమాధవ క్షేత్రాలలో ఒకటైన కుంతీమాధవ క్షేత్రంగానూ, శ్రీపాదవల్లభుల జన్మస్థానమై
దత్తక్షేత్రంగానూ పేరొందింది.
ఈ క్షేత్రంలో సతీదేవి యొక్క పీఠభాగం పడినట్లుగా చెప్పబడుతోంది. అమ్మవారి పీఠభాగం
పడటం చేతనే ఈ క్షేత్రం పిఠాపురం అయిందని స్థానిక కథనం. కాగా వివిధ కాలాలలో ఈ క్షేత్రం-
పురుహూతికా నగరమని, పీఠికాపురమని, పిష్ఠపురం అని పలుపేర్లతో పిలవబడినట్లుగా సాహిత్య
మరియు చారిత్రక ఆధారాల వలన తెలుస్తోంది. స్కాందపురాణంలోని భీమఖండంలోనూ,
వాయుపురాణంలోనూ ఈ క్షేత్ర ప్రాశస్త్యం చెప్పబడింది. ఇంకా మోక్షాన్ని ప్రసాదించే నాలుగు క్షేత్రాలలో
ఈ క్షేత్రం కూడా ఒకటిగా పేర్కొనబడింది.
పరమేశ్వరుడు ఈ క్షేత్రంలో కుక్కుటేశ్వరుడై స్వయం వ్యక్తంగా వెలసిన కారణంగా ఈ క్షేత్రానికి
స్వయంభూ కుక్కుటేశ్వర క్షేత్రమనే పేరొచ్చింది. ఇక మన పితరులకు ముక్తిని కలిగించే గయాక్షేతాలు
మనకు మూడుగా చెప్పబడ్డాయి. అవి - పాదగయ, నాభిగయ, శిరోగయ. వీటిలో పాదగయ
పిఠాపురం కాగా, ప్రస్తుత ఒరిస్సా రాష్ట్రంలోని జాజ్ పూర్ దగ్గర నాభిగయ, బీహార్ రాష్ట్రంలోని
గయాక్షేత్రం శిరోగయగా చెప్పబడుతున్నాయి. ఈ మూడు గయాక్షేతాలు కూడా అష్టాదశ శక్తిపీఠ
క్షేత్రాలు కావడం విశేషం. పిఠాపుర క్షేత్రంలో పురుహూతికాదేవి కొలువుతీరివుండగా,
నాభిగయలో గిరిజాదేవి, శిరోగయలో మంగళగౌరి, కొలువుతీరి వున్నారు.
ఈ పిఠాపురక్షేతం పంచమాధవ క్షేత్రాలలో ఒకటి. వృతాసుర సంహారం చేసాక ఇంద్రుడు ఆ
పాప పరిహారం కోసం అయిదుచోట్ల విష్ణు ప్రతిష్ఠలను చేసాడు. ఆ క్షేతాలే పంచమాధవ క్షేత్రాలుగా
ప్రసిద్ధికెక్కాయి.
అవి... కాశి (బిందుమాధవుడు), ప్రయాగ (వేణు మాధవుడు), పిఠాపురం (కుంతిమాధవుడు),
రామేశ్వరం (సేతుమాధవుడు), అనంత పద్మనాభం (సుందరమాధవుడు). దత్తాత్రేయస్వామి
శ్రీపాదవల్లభునిగా ఈ పిఠాపురంలో జన్మించడంచేత యిది దత్తక్షేత్రంగా కూడా ప్రసిద్ధమైంది.
కాగా ఈ క్షేత్ర స్థలపురాణం ప్రధానంగా గయాసురునితో ముడిపడివుంది. పూర్వం
గయాసురుడనే రాక్షసరాజు తపస్సుచేత శివుని మెప్పించి, భూమండలంలోని అన్ని ప్రదేశాలకన్నా
అతని శరీరం అత్యంత పవిత్రమైనదిగా వుండే వరాన్నిపొందాడు.
గయాసురుడు ధర్మవర్తనుడైనప్పటికీ, అతని అనుచరులు లోకాలను బాధిస్తూ, జనులను
పీడించసాగారు. గయాసురుడు కూడా ఇంద్రుని జయించి, ఇంద్ర సింహాసనాన్ని ఆక్రమించాడు. దాంతో
ఇంద్రుడు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను గురించి తపస్సుచేసి, వారిని మెప్పించి,
గయుణ్ని మట్టుపెట్టమని వారిని కోరాడు. దానికి అంగీకరించారు త్రిమూర్తులు. తరువాత
త్రిమూర్తులు ప్రచ్ఛన్న వేషంలో గయుని వద్దకు బ్రాహ్మణ రూపాలతో వెళ్ళి వారు లోకరక్షణకై యాగాన్ని
చేయడానికి నిశ్చయించుకున్నారని, అందుకు సహక రించమని అతణ్ని కోరారు. అందుకు
సంతోషించిన గయుడు యాగ నిర్వహణకై తన ప్రాణాలనైనా యిస్తానన్నాడు.
అప్పుడు వారు యజ్ఞ నిర్వహణకు అనువైన పవిత్ర స్థలం భూమండలం మీద ఎక్కడాలేదని,
గయుని దేహమే తమ యజ్ఞనిర్వహణకు అనువైన స్థలమన్నారు. తన దేహాన్ని యజ్ఞవాటికగా
వినియోగించుకునేందుకు అంగీకరించాడు గయుడు.
అంతేకాకుండా వారి యజ్ఞం పూర్తయ్యేందుకు ఏడు రోజులు పడుతుందని, యజ్ఞం
పూర్తయ్యేంత వరకు కూడా గయాసురుడు దేహాన్ని కదిలించ కూడదని, ఒకవేళ మధ్యలో శరీరాన్ని
కదిలిస్తే వారు గయుణ్ని సహకరించాల్సి వస్తుందనే షరతను విధించారు మాయా వేషంలో వున్న
త్రిమూర్తులు. అందుకుకూడా గయుడు అంగీకరించడంతో యాగం ప్రారంభమయింది. గయుడు తన
శరీరాన్ని పెద్దదిగా చేయడంతో దాని పైనే త్రిమూర్తులు యాగాన్ని ప్రారంభించారు. కోడికూత
ఆధారంగా రోజులను లెక్కపెట్టుకుంటున్నాడు గయుడు. ఆరురోజుల యాగం పూర్తయింది.
ఏడవరోజున తెల్లవారకముందే అంటే అర్థరాత్రే శివుడు కుక్కుటంగా అంటే కోడిపుంజుగా మారి
కూతపెట్టాడు. దాంతో ఏడవరోజు పూర్తయిందని తన దేహాన్ని కదిలించాడు గయుడు. యజ్ఞం భంగం
అయిందనే నెపంతో గయాసురుణ్ని సంహరించాడు విష్ణుమూర్తి. ఆ సందర్భంలో గయుడి
శరీరభాగాలు పడిన మూడు ప్రదేశాలు కూడా పుణ్యధామాలుగా వెలసాయి. అవే గయా క్షేత్రాలు కాగా
ఈ సందర్భంలోనే పరమేశుడు పిఠాపురంలో కుక్కుటేశ్వరునిగా కొలువుతీరగా, అమ్మవారు పురుహూ
తికాదేవిగా వెలిసింది.
పిఠాపురంలో కుక్కుటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోనే పురుహూతికా దేవి ఆలయం
వుంది. ఆలయంలోని అమ్మవారు చక్కని నల్లరాతితో మలచబడి మనోహరంగా దర్శనమిస్తుంది.
ఆలయంలోని ప్రాచీనమూర్తి స్థానంలో ప్రస్తుతమున్న నవీన మూర్తిని ప్రతిష్ఠించినట్లుగా తెలుస్తోంది.
అమ్మవారు చతుర్భుజాలను కలిగివుండి, కుడివైపు చేతులలో దండము, మాదీఫలము,
ఎడమవైపున డాలు, పానపాత్రను కలిగివుంటుంది.
11. ఓఢ్యాణం - గిరిజాదేవి

ఓఢ్యాణం ఒరిస్సా రాష్ట్రంలోని జాజ్ పూర్ జిల్లాలో వుంది. ఈ క్షేత్రంలోని అమ్మవారికి
గిరిజాదేవి అనిపేరు. స్థానికులు ఈ దేవిని విరజాదేవి, బిరిజాదేవి అనే పేర్లతో కూడా పిలుస్తారు.
ఇక్కడ సతీదేవి యొక్క నాభిభాగం పడిందని ప్రతీతి.
స్థలపురాణం ప్రకారం లోకశాంతికోసం ఈ క్షేత్ర ప్రాంతంలో ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఒక
యజ్ఞాన్ని చేసాడు. ఆ యజ్ఞ గుండం నుండి ఆదిపరాశక్తి ఉద్భవించి, బ్రహ్మ దేవుణ్ణి వరాన్ని
కోరుకోమన్నది. అప్పుడు బ్రహ్మదేవుడు అమ్మవారిని భూమిపై వెలసి, లోకాలకు శాంతిని ప్రసాదిస్తూ,
భక్తులను కటాక్షిస్తుండమని కోరుకున్నాడు. దాంతో అమ్మవారు గిరిజాదేవిగా ఈ క్షేత్రంలో వెలసింది.
ఓఢ్యాణంలోని ఆలయం ఒరిస్సా నిర్మాణ పద్ధతిలో నిర్మితమైంది. ప్రాచీనమైన ఈ ఆలయం
నిర్మాణశైలిలో రాజపుత్రదర్పం కనిపిస్తుంది. ఆలయంలో అమ్మవారి ముఖం మాత్రం కన్పించే
విధంగావుంచి, మిగతా విగ్రహాన్నంతా బంగారు ఆభరణాలతోనూ, పూలమాలలతోనూ
అలంకరిస్తారు.
ఈ అలంకరణలో అమ్మవారు కుడిచేత చక్రాన్ని ధరించినట్లుగా కూడా చూపుతారు. అయితే
అమ్మవారి నిజస్వరూపం దుర్గా స్వరూపంగా చెప్పబడుతోంది. క్రిందపడివున్న ఒక మహిషం మీద
అమ్మవారు నిలుచుని, కుడిచేత శూలాన్ని ధరించి, ఎడమచేత మహిషం యొక్క తోకను పట్టుకుని,
ఉగ్రస్వరూపిణిగా వుంటుంది. కానీ అలంకరణలో అమ్మవారు సౌమ్యమూర్తిగానే దర్శనమిస్తుంది.
సంవత్సరంలో ఒక్క దుర్గాష్టమి రోజున మాత్రం అమ్మవారి మూలరూపాన్ని దర్శించే అవకాశం
వుంటుంది.
ఓఢ్యాణం నాభిగయ క్షేత్రం కాబట్టి చాలా మంది యిక్కడ ఆలయ ప్రాంగణంలోనే
పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తుంటారు. ఈ ఆలయానికి సమీపంలోనే వైతరణీనది ప్రవహిస్తూ
వుంటుంది. ఈ నదీతీరంలోనే యమధర్మరాజు ఆలయంకూడా వుంది. ఈ ఆలయానికి కొంచెం
దూరంలోనే శ్వేతవరాహస్వామి ఆలయాన్ని కూడా చూడవచ్చు.
12. ద్రాక్షారామం - మాణిక్యాంబ

ద్రాక్షారామం మనరాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం మండలంలో
వుంది. ఇక్కడి అమ్మవారికి మాణిక్యాంబ అని పేరు. స్థానికంగా ఈమెను మాణిక్యాదేవి అని కూడా
పిలుస్తారు. ఈ క్షేత్రంలో సతీదేవి ఎడమచెంప పడినట్లుగా చెప్పబడుతోంది. ద్రాక్షారామం పంచారామ
క్షేతం కూడా. ఇక్కడి స్వామికి భీమేశ్వరుడని పేరు. మన పురాణాలలో దక్షవాటికగా చెప్పబడిన ఈ
ద్రాక్షారామం, సతీదేవి తండ్రి అయిన దక్షప్రజాపతి రాజ్యంలోని దక్షిణభాగమని చెబుతారు.
ఒకసారి వ్యాసమహర్షి కాశీకి వెళ్ళాడు. శివుడు ఆయన్ను పరీక్షించదలచి, వ్యాసునికి కాశిలో
తిండి దొరకకుండా చేసాడు. అప్పుడు వ్యాసుడు కోపంతో కాశీని శపించబోతే, అన్నపూర్ణాదేవి
ప్రత్యక్షమై వ్యాసునికి, అతని పరివారానికి అన్నాన్ని పెట్టింది. కానీ పరమేశుడు మాత్రం కోపంతో
వ్యాసుణ్ణి కాశీ క్షేత్రం విడిచి వెళ్ళమన్నాడు. అప్పుడు అన్నపూర్ణాదేవి వ్యాసునికి ద్రాక్షారామానికి
వెళ్ళమని చెప్పడంతో వ్యాసుడు యిక్కడకొచ్చి ఈ క్షేత్రంలో చాలాకాలం వున్నాడని పురాణకథ.
ఇక్కడి స్థలపురాణం ప్రకారం పూర్వం కుమార స్వామి తారకాసురుని మెడలోని
అమృతలింగాన్ని చేధించి, తారకుణ్ని సంహరించాడు. కుమారస్వామిచే ఛేదింపబడిన అమృతలింగం
అయిదు ముక్కలై ఐదు ప్రాంతాలలో పడిన సందర్భంలో ఒక భాగం ద్రాక్షారామంలో పడింది. అప్పుడు
సప్తఋషులు ఈ శకలానికి పవిత్ర గోదావరి జలంతో సంప్రోక్షణ చేసి, యిక్కడ ప్రతిష్ఠించాలని
భావించారు. అందుకు ద్రాక్షారామానికి రావల సిందిగా గోదావరిని ప్రార్థించారు ఋషులు. గోదావరి
అంగీకరించి ఋషు లను అనుసరించింది.
కారణాంతరాలవలన సప్తఋషులు గోదావరితో సకాలంలో అంటే ప్రతిష్ఠాముహూర్తానికి
ద్రాక్షారామాన్ని చేరుకులేకపోతారు. ఆ కారణంగా దేవతల కోరిక మేరకు పరమశివుడే ద్రాక్షారామంలో
స్వయంగా ప్రతిష్టితుడై భీమేశ్వరునిగా కొలువుతీరాడు. ఈ సందర్భంలోనే అమ్మవారు మాణిక్యాంబ
పేరుతో భీమేశ్వరుని దేవేరిగా యిక్కడ కొలువుతీరింది.
ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయ ప్రాంగణంలో మాణిక్యాంబ ఆలయం వుంది. అయిదు
ప్రాకారాలుగల భీమేశ్వర ఆలయంలోని రెండవ ప్రాకారంలో లోపలిభాగంలో చుట్టూ
మండపాలున్నాయి. ఈ రెండవ ప్రాకారంలోని మండపాలలోనే ఉత్తర ఈశాన్య భాగంలో అమ్మవారి
ఆలయం వుంది. శ్రీచక్ర మేరువుపై నెలకొనివున్న ఈ దేవి రెండు చేతులను కలిగివుండి, కుడి వైపు
ఉత్పలాన్ని ధరించి, ఎడమ వైపు ప్రలంబహస్తంతో దర్శన మిస్తుంది.
13. హరిక్షేత్రం - కామరూపాదేవి

అష్టాదశ శక్తిపీఠాల్లో పదమూడవ పీఠం... హరిక్షేత్రం. ఈ క్షేత్రానికి కామరూప క్షేత్రం అని కూడా
పేరు. మన పురాణాలలో నరకాసురుడు పరిపాలించినట్లుగా చెప్పబడిన ప్రాగ్జ్యోతిషపురమే ఈ
కామరూప ప్రాంతం. ప్రస్తుతం యిది నేటి అస్సాం రాష్ట్రంలో వుంది. ఈ క్షేత్రంలోని అమ్మవారిని
కామరూపాదేవి అని పిలుస్తారు. ఆమెకే కామాఖ్య అని కూడా పేరు. కామరూపాదేవి అనే పేరుకంటే
కామాఖ్య అనే పేరే అమ్మవారికి ఎంతో ప్రసిద్ధం. ఈ క్షేత్రంలో సతీదేవి యొక్క యోనిభాగం పడిందని
చెబుతారు. అస్సాం రాష్ట్ర రాజధాని అయిన గౌహతి నగరానికి రెండు కిలోమీటర్ల దూరంలో నీలాచల
పర్వతంపై ఈ క్షేత్రం వుంది. కాళికాపురాణంలో ఈ క్షేత్రానికి సంబంధించిన సమస్త విషయాలు
వివరించబడ్డాయి. అష్టాదశ శక్తిపీఠాలలో తాంత్రిక సంబంధంగా ఎంతోప్రసిద్ధి చెందిన క్షేత్రం ఈ
కామాఖ్యనే.
ఇక్కడి స్థలపురాణం ప్రకారం బ్రహ్మ తన సృష్టిని ప్రారంభించే ముందు ఆది పరాశక్తిని
ధ్యానించకుండానే అహంకారంతో జగత్తును సృష్టించేందుకు ఉపక్రమించాడట. అప్పుడు ఆదిపరాశక్తి
అతని అజ్ఞానాన్ని పోగొట్టేందుకై, అతని అహంకారం నుంచి కేశి అనే రాక్షసుని సృష్టించింది. ఆ
రాక్షసుడు బ్రహ్మనే చంపేందుకు ప్రయత్నించాడు. అప్పుడు బ్రహ్మ విష్ణువును శరణువేడాడు. ఆ ఆపద
నుంచి గట్టెక్కేందుకు విష్ణువు యిచ్చిన సలహా మేరకు బ్రహ్మ పరాశక్తిని గురించి తపస్సు చేశాడు.
అప్పుడు బ్రహ్మకు పరాశక్తి ప్రత్యక్షమై, బ్రహ్మ అహంకారం నుండి పుట్టిన ఆ రాక్షసుని సంహరించింది.
తరువాత బ్రహ్మ తపస్సు చేసిన స్థలంలో పరాశక్తి ఒక యోనిముద్రను సృష్టించి, ఆ యోనిముద్రను
అర్చించి, సృష్టిని ప్రారంభించమని బ్రహ్మకు సూచించింది. ఆ విధంగా సృష్టిని ప్రారంభించాడు బ్రహ్మ.
ఆ యోని ముద్రాంకితమైన ప్రదేశమే కామాఖ్య.
కాగా తరువాతి కాలంలో మన్మధుడు శివతపోభంగాన్ని చేసినప్పుడు తన ఫాలనేత్రాగ్నితో
మన్మధుని భస్మం చేస్తాడు శివుడు. అప్పుడు రతీదేవి దుఃఖిస్తూ, మన్మధుని బ్రతికించమని శివుణ్ని
వేడుకుంటుంది. దేవతలందరూ కూడా యిందుకు తాముకూడా బాధ్యులమేనని, యిందులో
మన్మధుని తప్పేమీ లేదని, కాబట్టి మన్మధుని తిరిగి బ్రతికించమని ప్రార్థిస్తారు. అప్పుడు శివుడు
మన్మధుని తిరిగి బ్రతికిస్తాడు. కానీ అతనికి ముందున్న సుందరరూపం ఉండదు. రతీమన్మధులు
తిరిగి శివుని ప్రార్థించడంతో శివుడు కామాఖ్యరూపాన్ని పూజించి, యోని ముద్రాంకిత ప్రదేశంలో
అమ్మవారికి ఆలయాన్ని కట్టించమని చెబుతాడు శివుడు. అప్పుడు విశ్వకర్మతో మన్మధుడే మొదటగా
కామాఖ్య ఆలయాన్ని నిర్మించాడని చెప్పబడుతోంది. అయితే కాలక్రమంలో ఈ ఆలయం
మరుగునపడి కాలగర్భంలో కలిసి పోయింది.
తరువాతి కాలంలో నిర్మించబడిన ప్రస్తుత కామాఖ్యఆలయం గర్బాలయం, అంతరాలయం,
ముఖమండపం, మహామండపం, ప్రవేశ మండపాలతోకూడి, శిల్పసంపదతో అలరారుతోంది. ఈ
ఆలయం ఆంగ్లశకం 12-13 శతాబ్దాలలో నిర్మించినట్లుగా తెలుస్తోంది.
గర్భాలయం అంతరాలయంకన్నా దాదాపు 18 అడుగుల లోతులో వుంటుంది. అయితే
గర్భాలయంలో అమ్మవారి విగ్రహస్వరూపం వుండదు.
ఇక్కడ యోని భాగాన్ని తలపించే రాతి నిర్మాణం (శిలారూపం) వుంటుంది. దీనికే
యోనికుండం అనిపేరు. నిరంతరంగా ఎప్పుడూ ఆ భాగం నుండి నీరు ఊటలాగా స్రవిస్తూ వుంటుంది.
గర్భాలయం ఉత్తరం నుండి దక్షిణానికి ఏటవాలుగా ఉండటంతో యోని కుండం నుంచి స్రవించేనీరు
దక్షిణానికి ప్రవహిస్తూ గర్భాలయంలోనే అంతరించి పోతుంది. ఈ పవిత్ర జలాన్ని భక్తులు తలపై
పోసుకుని తీర్థంగా స్వీకరిస్తారు.
ఈ ఆలయంలో ఎంతో విశేషం వుంది. ప్రతీ సంవత్సరం ఆషాఢమాసంలో శుక్లపక్ష సప్తమి
మొదలు ఏకాదశి వరకు యోనికుండం నుంచి సహజంగా స్రవించే నీరు రంగుమారి ఎర్రగా వస్తాయి.
ఈ సమయాన్ని అమ్మవారికి ఋతుస్రావ సమయంగా పరిగణిస్తారు. ఈ రోజుల్లో మొదటి మూడు
రోజులు ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తారు. నాలుగవ రోజున అమ్మవారికి ప్రత్యేక అభిషేకాన్ని చేసి
భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఐదవ రోజున ‘అంబువాసి యోగం’ అనే ఉత్సవాన్ని
నిర్వహిస్తారు.
14. ప్రయాగ - మాధవేశ్వరి

ప్రయాగ క్షేత్రంలో అమ్మవారు మాధవేశ్వరిగా కొలువు తీరి, భక్తుల పూజలందుకుంటోంది.
ప్రస్తుత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాదు నగరమే ప్రయాగక్షేత్రం. ఈ క్షేత్రంలో అమ్మవారి కుడిచేతి
నాలుగు వేళ్ళు పడినట్లుగా చెప్పబడుతోంది.
పూర్వం ప్రజాపతి అయిన బ్రహ్మదేవుడు ఈ ప్రాంత మాహాత్మ్యాన్ని గుర్తించి, యిక్కడ అనేక
యాగాలను చేశాడట. అందువల్లనే ప్రయాగకు ‘ప్రజాపతి క్షేత్రం’ అనే పేరుకూడా పురాణాలలో
కనిపిస్తుంది. కాగా 'ప్ర-యాగ' అనే నామములో ‘ప్ర’ అంటే ‘ప్రకృష్ట మైన’, ‘గొప్ప’ అని అర్థం. అంతే
కాకుండా ‘ప్ర’ అనే శబ్దానికి ‘ప్రజాపతి’ అనే అర్థాన్ని కూడా చెబుతారు. ప్రజాపతి యాగాలు చేసిన
స్థలం కాబట్టి ఈ క్షేత్రానికి ప్రయాగ అనే పేరొచ్చిందని చెబుతారు.
ఈ క్షేత్రంలోని మాధవేశ్వరిని మొదటగా సూర్య భగవానుడు సేవించాడని చెప్పబడుతోంది.
అందుకే దీన్ని భాస్కర క్షేత్రమని చెబుతారు. అంతేకాకుండా శ్రీరామ చంద్రుడు తన వనవాసంలో
మొదటగా యిక్కడి మాధ వేశ్వరిని సేవించినట్లుగా తెలుస్తోంది.
ఈ క్షేత్రంలో భరద్వాజుని ఆశ్రమం వుండేదని, అరణ్యవాస ప్రారంభంలో మొదటగా శ్రీరాముడు
భరద్వాజుని ఆశ్రమాన్ని చేరుకొని, ఆయన సూచన మేరకు మాధవేశ్వరిని సేవించాడని
పేర్కొనబడింది. మన పురాణాలలో ఈ ప్రయాగ క్షేత్రం ఎంతో గొప్పగా కీర్తించబడింది.
స్కాందపురాణం, మత్స్యపు రాణం, అగ్నిపురాణం, పద్మపురాణం, గరుడపురాణాలలోనూ,
రామాయణాది మహాభారతాలలోనూ ప్రయాగక్షేత్ర ప్రస్తావన కనిపిస్తుంది.
ప్రయాగ త్రివేణి సంగమ క్షేత్రం. ఇక్కడ సరస్వతి, గంగ, యమునా నదులు సంగమిస్తున్నాయి.
అయితే సరస్వతీ నది అంతర్జానం కావడంవలన ప్రస్తుతం యిక్కడ మనం గంగా, యమునా నదుల
సంగమాన్ని మాత్రమే చూడగలుగుతున్నాం. అయితే సరస్వతీనది యిక్కడ అంతర్వాహినిగా
ప్రవహిస్తున్నదని మన విశ్వాసం.
ఈ క్షేత్రంలో త్రివేణి సంగమంలో స్నానం చేయడంతోపాటు, పితృ దేవతలకు తర్పణాలను
యివ్వడం, పిండ ప్రదానాలను చేయడం ఎంతో ప్రసిద్ధంగావుంది.
క్షీరసాగర మధనం తర్వాత విష్ణుమూర్తి మోహినీరూపాన్ని ధరించి దేవతలకు అమృతాన్ని
పంచేసమయంలో ఆదిపరాశక్తి యిక్కడ దేవతలకు దర్శనమిచ్చిందని, దేవతల కోరికమేరకు యిక్కడే
మాధవేశ్వరిగా కొలువుతీరిందని చెబుతారు. ఆ సందర్భంలో దేవ గురువైన బృహస్పతి మాధవేశ్వరిని
అమృతంతో అభిషేకించాడని, అందుకే ఈ క్షేత్రానికి అమృత తీర్థమనే పేరుందని చెబుతారు.
మాధవేశ్వరి ఆలయంలో అమ్మవారి విగ్రహం వుండదు. నాలుగు దిక్కులా సమానంగా వుండే
ఒక పీఠం వుంటుంది. దానిపై ఒక వస్త్రాన్ని వేలాడదీసి, క్రింద ఉయ్యాల కడతారు. భక్తులు తాము
తెచ్చిన కానుకలను ఈ ఉయ్యాలలో ఉంచి, అమ్మవారిని కొలిచినట్లుగా భావిస్తారు. స్థానికంగా
మాధవేశ్వరిని ‘అలోపీదేవి’ అని పిలుస్తారు.
15. జ్వాలాక్షేత్రం - వైష్ణవీదేవి

జ్వాలాక్షేత్రంలో అమ్మవారు వైష్ణవీదేవిగా కొలువుదీరింది. ఇక్కడ సతీదేవి శిరస్సు పడింది.
కాశ్మీర్ రాష్ట్రంలోని జమ్ము నగరానికి 60కి.మీ. దూరంలో వైష్ణవీదేవి ఆలయం వుంది. ఈ ఆలయాన్ని
దర్శించాలనుకునేవారు ముందుగా జమ్ము నుంచి కత్రాకు చేరుకోవాలి. ఆలయం వెలసిన పర్వతానికి
త్రికూట పర్వతం అని పేరు. ఇది సముద్ర మట్టానికి 6000 అడుగుల ఎత్తులో వుంది.
మహాభారత యుద్ధానికి ముందు శ్రీకృష్ణుని సూచనమేరకు పాండవులు వైష్ణవీదేవిని
పూజించారని చెబుతారు. ఇక్కడి ఆలయంలోని అమ్మవారు గుహలో కొలువుతీరి వుంది. దాదాపు
100 అడుగుల గుహలో, గుహ గోడపైన వైష్ణవీదేవి దర్శనమిస్తుంది. ఈ గుహలోకి వెళ్ళాలంటే
కొంతదూరం బాగావంగి నడవాల్సి వుంటుంది.
గుహలో అమ్మవారు శిలారూపంలో కొలువుతీరింది. ఈ శిల క్రింది భాగంలో ఒకటిగానే వుండి
పైభాగానికి వచ్చేటప్పటికి మూడు భాగాలుగా గోచరిస్తోంది.
కుడివైపున వుండే నల్లని శిలాభాగాన్ని మహాకాళిగా, మధ్యలోవుండే పచ్చని భాగాన్ని లక్ష్మిగా,
ఎడమవైపున వుండే తెల్లనిభాగాన్ని సరస్వతిగా చెబుతారు. అంటే యిక్కడి అమ్మవారు ఏకీకృతమైన
త్రిశక్తిస్వరూపం అన్నమాట. గుహలో ప్రవహించే నీటి ప్రవాహాన్ని ‘చరణ్ గంగ’ అని పిలుస్తారు.
కాగా కొందరు హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రాలోని అమ్మవారిని 15వ శక్తిపీఠమైన వైష్ణవీదేవిగా
చెబుతున్నారు. ఇక్కడ సతీదేవి నాలుక పడినట్లుగా చెప్పబడింది. ఇచ్చట గల అమ్మవారికి
జ్వాలాముఖీ అని పేరు. ఈ క్షేత్రంలో కూడా అమ్మవారికి విగ్రహం వుండదు. భూమిలోంచి వచ్చే
సహజవాయువుల జ్వాలనే అమ్మవారి శక్తిగా (రూపంగా) భావిస్తారు. ఈ జ్వాలలను అవమాన
భారానికిగురైన సతీదేవి ఆగ్రహానికి సంకేతమని చెబుతారు.
ఏది ఏమైనప్పటికీ ఎక్కువమంది జమ్ముకు సమీపంలో గల వైష్ణవీదేవి నిలయాన్నే 15వ
శక్తిపీఠంగా భావిస్తున్నారు.
16. గయ - మాంగల్యగౌరి

అష్టాదశ శక్తిపీఠాల్లో పదహారవ శక్తిపీఠమైన గయాక్షేత్రంలో పరాశక్తి మాంగల్యగౌరిగా
కొలుదీరింది. ఈ దేవినే మంగళగౌరీదేవి అని కూడా పిలుస్తారు. ఇక్కడ సతీదేవి యొక్క స్తనాలు
పడినట్లుగా చెప్పబడుతోంది.
గయా క్షేత్రం ప్రస్తుత బీహార్ రాష్ట్రంలో రాజధాని నగరమైన పాట్నాకు - సుమారు 75కి.మీ.
దూరంలో వుంది.
మన పితరులకు ముక్తిని కలిగించే మూడు గయాక్షేత్రాలలో ఈక్షేత్రం శిరోగయగా
చెప్పబడుతోంది. తక్కినవి మనరాష్ట్రంలోని పిఠాపురం (పాదగయ), ఒరిస్సా రాష్ట్రంలోని జాజ్ పూర్
దగ్గర అష్టాదశ శక్తి స్వరూపాలలో ఒకరైన గిరిజాదేవి కొలువుదీరిన ఓఢ్యాణం (నాభిగయ). కాగా ఈ
గయాక్షేత్ర స్థలపురాణం కూడా గయాసురునితోనే ముడిపడి వుంది (ఈ పురాణ కథ పిఠాపురం క్షేత్ర
వివరణలో యివ్వబడింది).
అయితే ఈ క్షేత్రంలో అమ్మవారు కొలువుదీరడానికి సంబంధించి మరొక కథ కూడా ప్రచారంలో
వుంది. ఆ కథ ప్రకారంగా బ్రహ్మదేవుని మానస పుత్రుడు మరీచి మహర్షి ఆయన భార్య ధర్మవ్రత.
వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవిస్తుండేవారు. ఒకనాడు భోజనానంతరం మరీచి పడుకొని
దర్మవ్రతను కాళ్ళు పట్టమన్నాడు. ధర్మవ్రత కాళ్ళు పడుతుండగా మరీచి నిద్రలోకి జారుకున్నాడు.
అదే సమయంలో బ్రహ్మదేవుడు వారి ఆశ్రమానికి వచ్చాడు. అప్పుడు ధర్మవ్రత కాళ్ళు పట్టడాన్ని ఆపి
బ్రహ్మ దేవుడికి అతిథి సత్కారాలు చేయసాగింది. దాంతో నిద్రాభంగమైన మరీచి భర్తసేవను విడిచి
పరాయి పురుషుణ్ణి సేవించిందనే నెపంతో ధర్మవ్రతను శిలగా మారిపొమ్మని శపించాడు.
కానీ దానికి ధర్మవ్రత తాను ధర్మాచరణకే అంటే అతిథిని సత్కరించేందుకే భర్తసేవను మానడం
జరిగిందని, కాబట్టి తన తప్పులేదని, తాను శాపాన్ని అంగీకరించనంటూ విష్ణుమూర్తిని గురించి
తపస్సు చేసింది.
విష్ణువు ప్రత్యక్షమై, మహర్షి శాపం ఆపడం ఎవరి వల్లా కాదని, కాబట్టి శాపాన్ని
అంగీకరించమని ధర్మవ్రతకు సూచించాడు. దాంతో ధర్మవ్రత తాను శిలగా మారిపోతానని, అయితే ఆ
శిలపై విష్ణుపాదాలు నిత్యం వుండాలని, ఆ శిలను తాకిన వారికి మోక్షం కలగాలని విష్ణువును కోరింది.
అందుకు అంగీకరించాడు విష్ణువు.
తరువాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రచ్ఛన్న వేషంలో గయాసురుని దేహాన్ని యజ్ఞవాటిగా
చేసుకొని యాగం చేసేటప్పుడు, గయాసురుని తల కదలకుండా వుండేందుకు ఆ తలపై ఒక శిలను
వుంచాల్సి వచ్చింది. అప్పుడు విష్ణువు గతంలో శాపం కారణంగా ధర్మవ్రత శిలగా మారివుండటం
వలన, ఆ శిలనే తెచ్చి గయుని తలపై వుంచాడు. తాను ఆ శిలపై నిలుచున్నాడు. తరువాత విష్ణువు
గయలో గదాధరునిగా వెలిశాడు.
అయితే ఈ క్షేత్రంలో ధర్మవ్రత తాను శిలగా మారే ముందు పరాశక్తిని ప్రార్థించి, ఆ దేవిని తాను
శిలగా పడివుండే ప్రాంతంలో కొలువుతీరమని కోరడంతో, యిక్కడ అమ్మవారు మాంగల్యగౌరిగా
వెలసిందని చెబుతారు.
కాగా గయా క్షేత్రంలో ఫల్గుణి, మధుర, శ్వేత అనే మూడు నదులు ప్రవహిస్తున్నాయి. వీటిలో
ఫల్గుణీనది ముఖ్యమైంది. అయితే ప్రస్తుతం ఎండిపోయిన ఈ నది అంతర్వాహినిగా ప్రవహిస్తున్నదని
చెబుతారు.
గయలో గదాధరుని ఆలయానికి విష్ణుమందిరం అని పేరు. ఈ విష్ణు మందిరానికి ప్రక్కన
మాంగల్యగౌరీదేవి ఆలయం వుంది. విశాలమైన ఈ ఆలయంలో అమ్మ వారు చక్కటి అలంకరణతో
దర్శనమిస్తారు. ఈ అమ్మ వారిని విష్ణుసహోదరిగా చెబుతారు. ఈ గయా క్షేత్రం పితృదేవతారాధనకు,
పిండ ప్రదానాలకు ఎంతో ప్రసిద్ది.
17. వారణాసి - విశాలాక్షి

భారతీయులందరూ ఎంతోపవిత్రంగా భావించే వారణాసి క్షేత్రం ఉత్తరప్రదేశ్లోని గంగాతీరంలో
వుంది. శక్తిపీఠంతోపాటు యిది జ్యోతిర్లింగ క్షేత్రంకూడా. ఇక్కడ పరమేశ్వరుడు విశ్వనాథ
జ్యోతిర్లింగంగా కొలువుదీరాడు. కాగా కాశీ క్షేత్రంలో సతీదేవి మణికర్ణిక (చెవి కుండలం) పడిందట. ఈ
క్షేత్రానికి యిరువైపులా ‘వరుణ’, ‘అసి’ అనే రెండు నదులు ప్రవహిస్తుండటం వలన ఈ క్షేత్రం
వారణాసిగా పేరొందింది.
పరమేశుని దివ్య జ్యోతిర్లింగం యిక్కడ ప్రకాశమానం అవుతోంది కనుక, ఈ క్షేత్రం కాశీగా
ప్రసిద్ధమైంది. ‘కాశి’ అంటే కాంతి, వెలుగు, తేజస్సు, ప్రకాశము అనే అర్థాలున్నాయి. కాశీ క్షేత్రంలో
విశాలాక్షీ దేవి కొలువుతీరటంవెనుక ఒక కథ ఎంతగానో ప్రచారంలో వుంది.
పూర్వం ఒకప్పుడు భూలోకమంతా చెడుపాలకులతో నిండిపోయి ధర్మహాని కలిగింది.
అప్పుడు బ్రహ్మదేవుడు తపస్సు చేసుకుంటున్న దివోదాసు అనే క్షత్రియుణ్ని పిలిచి తపస్సు మాని
కాశీ రాజ్యాన్ని పాలించమన్నాడు. అందుకు దివోదాసు అంగీకరిస్తూనే, దేవతలందరూ భూలోకాన్ని
వదలి వెళితేనే తాను కాశీని పాలించగలనన్నాడు. దాంతో దేవతలందరితోపాటు పరమేశుడు కూడా
కాశీని వదలి వెళ్ళాడు. దివోదాసు కాశీని పాలించసాగాడు. కానీ పరమేశుడు కాశీ వియోగాన్ని
భరించలేకపోయాడు.
తండ్రి బాధను చూడలేని వినాయకుడు డుంఢి విఘ్నేశ్వరునిగా కాశీకి చేరాడు. దివోదాసుకు
భక్తి, వైరాగ్యాలు కలిగేటట్లు చేసాడు. దాంతో దివోదాసు స్వయంగా పరమేశుని కాశీకి ఆహ్వానించాడు.
శివుడు పరమానందంతో కాశీక్షేత్రంలో తిరిగి ప్రవేశించాడు.
ఈ సందర్భంలో పార్వతీదేవి ఆశ్చర్యచకితురాలై తన కళ్ళను పెద్దవిచేసి, విశాలమైన అక్షాలతో
పరమేశుని చూసి, ఈ క్షేత్రంలోనే విశాలాక్షిగా కొలువుదీరింది.
కాశిలో విశ్వేశ్వర ఆలయానికి రెండు వీధుల తర్వాత దక్షిణంగా విశాలాక్షి ఆలయం వుంది.
అయితే చూసేందుకు ఈ ఆలయం ఎంతో సాధారణ నిర్మాణ శైలిలో కనిపిస్తుంది. అయితే
ఆలయంలోని అమ్మవారు నయనా నందకరంగా దర్శనమిస్తారు.
18. కాశ్మీరు - సరస్వతీదేవి

అష్టాదశ మహశక్తి రూపాలలో చివరగా చెప్పబడుతున్న సరస్వతీదేవి వెలసిన పీఠం కాశ్మీర్లో
వుంది. కాశ్మీరు రాష్ట్రంలోని శ్రీనగర్కు 10కి.మీ. దూరంలో సరస్వతీదేవి ఆలయాన్ని చూడవచ్చు.
ఇక్కడ సతీదేవి యొక్క కుడి చేయి పడిందని చెప్పబడింది.
కాశ్మీరులో సరస్వతీదేవి కొలువుతీరడానికి సంబంధిం చిన గాథ స్థానికంగా ఎంతో ప్రసిద్ధిలో
వుంది. శివపార్వతుల కల్యాణం తరువాత వారు కొంతకాలం హిమాలయాలలో విహరించసాగారు. ఆ
సమయంలో భూలోకంలో ఒక గృహాన్ని నిర్మించుకోవాలని పార్వతీ దేవికి కోరిక కలిగింది. దాంతో
పరమశివుడు విశ్వకర్మని పిలిచి సముద్రమధ్యంలో దీనిని ఏర్పాటుచేసి గొప్ప గొప్ప భవనాలతో
కూడిన గొప్ప నగరాన్ని నిర్మింపజేశాడు. అదే లంకా నగరం.
గృహప్రవేశం చేసేందుకై శివపార్వతులు రావణాసురుని పురోహితునిగాపిలిచారు. ఎంతో
వైభవంగా గృహ ప్రవేశాన్ని చేయించాడు రావణుడు. దానికి ఆనందించిన పార్వతి, రావణునితో
దక్షిణను కోరమని అడిగింది. అప్పుడు రావణుడు లంకానగరాన్ని తనకు దక్షిణగా యివ్వమన్నాడు.
మాటయిచ్చిన ప్రకారం లంకానగరాన్ని రావణునికిచ్చారు శివపార్వతులు. తరువాత పార్వతీదేవి
ఎంతోయిష్టంగా నిర్మించుకొన్న లంకానగరం యితరులకు యివ్వాల్సి రావడంతో ఎంతోకోపంతోనూ,
బాధతోనూ హిమాలయాలకు తిరిగొచ్చింది. ఆ సమయంలో పార్వతి బాధను తగ్గించి, ఆమెను
ఓదార్చేందుకు బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని పంపాడు. ఆ సందర్భంలోనే సరస్వతీదేవి కాశ్మీరులో
కొలువు దీరింది.
కాగా చారిత్రకంగా చూస్తే ఆంగ్లశకం 1-2 శతాబ్దాల నుండే (గుప్తుల కాలంనుండే) యిక్కడ
సరస్వతీదేవి పూజలందుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆంగ్లశకం 12వ శతాబ్దంలో కల్హణుడు రచించిన
రాజతరంగిణిలో ఈ క్షేత్ర ప్రస్తావనవుంది. మహాకవి కాళిదాసు యిక్కడి అమ్మవారిని దర్శించాడని
చెబుతారు. స్థానికంగా ఈ అమ్మవారిని ‘కీర్భవాని’ అని పిలుస్తారు. ఇక్కడ భక్తులు అమ్మవారిని
పాలతో అభిషేకించి, పాయసాన్ని నివేదించడం ఆచారంగా వుంది.
కాగా కొందరు ప్రస్తుత పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాదుకు సుమారు 150 కి.మీ
దూరంలో ఒక శక్తిపీఠం వుండేదని, అదే సరస్వతీ శక్తిపీఠమని చెబుతారు. అయితే ప్రస్తుతం అక్కడ
పూర్తిగా శిధిలమైన ఒక ఆలయం మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తోంది.